USBRL: కశ్మిర్ లోయలో తొలిసారిగా వందేభారత్ రైలు సేవలు..! 5 d ago

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందేభారత్ రైలు సేవలు కశ్మీర్ లోయలో ఏప్రిల్ 19 నుంచి కట్రా నుంచి కశ్మీర్కు తొలిసారి అందుబాటులోకి రానున్నాయి. 272 కి.మీ. మేర ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ (USBRL)లో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్19న ఈ రైలును ప్రారంభించనున్నారు.
ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్ రైలు వంతెనగుండా వెళ్లనుంది. ప్రస్తుతం జమ్ము రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్ము, కాత్రా గుండా వెళతాయి. సంగల్టాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది.
వందేభారత్ రైలు ప్రత్యేకత:
కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందేభారత్ ను ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు -20 డిగ్రీలకు పడిపోతాయి. దీంతో బయట విపరీతమైన మంచు కురుస్తున్నా లోపల ఉన్న ప్రయాణికులు వెచ్చదనాన్ని ఆస్వాదించేలా ఈ రైలును భారత రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా రైల్లోని నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.
కాశ్మీర్ లో రైళ్ల ప్రాజెక్టు:
కశ్మీరు రైళ్లతో అనుసంధానించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో 38 సారంగాలు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 119 కి.మీ. కాగా 12.75 కి.మీ. ఉండే టన్నెల్ టీ-49 దేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగం. ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు ఉన్నాయి. వీటిలో చినాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. ఈ మార్గంలో వంతెనలన్నింటి పొడవు కలిపి 13 కి.మీ.లు ఉంటుంది.
చీనాబ్ రైలు వంతెన ప్రత్యేకత:
ఈ వంతెనను జమ్మూ కశ్మీర్ లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్-కౌరీ మధ్య భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్ -శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. ఇటీవలే ఈ వంతెనపై ట్రయల్ రన్స్ కూడా విజయవంతంగా నిర్వహించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. అలాగే, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంది.